బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు!
- అన్నామలై బీజేపీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం
- ఢిల్లీలో అమిత్ షా, నితిన్ నబిన్తో భేటీకి రంగం సిద్ధం
- జూన్ 15లోగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం
- ఏఐఏడీఎంకేతో పొత్తు వంటి అంశాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఈ ఎన్నికల సమయంలో ఏఐఏడీఎంకేతో పొత్తు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో అధిష్ఠానంతో అన్నామలైకి భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో తనకు తగిన అవకాశాలు లభించడం లేదని, అందుకే రాజ్యసభ సీటును కూడా తిరస్కరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టాలంటూ పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఊహాగానాలపై అన్నామలై నేరుగా స్పందించలేదు. "దయచేసి రెండు రోజులు ఆగండి. కూర్చుని మాట్లాడుకుందాం" అని పేర్కొనడంతో ఆయన తదుపరి అడుగులపై మరింత ఉత్కంఠ నెలకొంది.
‘వి ది లీడర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్తూ, ‘ద్రవిడ 2.0’ పేరుతో లౌకిక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని అన్నామలై యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన రాజీనామా వార్తలపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.