జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
- 'సేనా గళం' పేరుతో కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కల్యాణ్
- పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ జనసేన కీలక నిర్ణయం
- ముల్లును ముల్లుతో తీసే ధోరణిని తోసిపుచ్చిన జనసేనాని
- వ్యక్తిగత తప్పులకు కులాలను ఆపాదించవద్దని స్పష్టం
- సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలే లక్ష్యం
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనే పాతకాలపు, బూర్జువా రాజకీయ ధోరణులకు జనసేన చరమగీతం పాడుతుందని తేల్చిచెప్పారు. ఒక కులం వారు విమర్శిస్తే, అదే కులం వారితో బదులిప్పించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలన్నదే జనసేన ఉద్దేశమని వివరించారు.
సమకాలీన రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల ముసుగు వేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పిదాలకు సామాజిక వర్గాలను బాధ్యుల్ని చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ తరహా రాజకీయాలను నేటి యువత (జెన్-జీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.
‘సేనా గళం’ కమిటీ.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ సమగ్రతకు భంగం కలగకుండా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపిస్తుందని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, ఆ వ్యవహారంలోకి కులాలను, మతాలను లాగకూడదనేది జనసేన పార్టీ స్పష్టమైన విధానమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.