గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి
- ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి
- ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం నుంచి 30 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఈరోజు వేకువజామున 4 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని డ్రైవర్ గమనించకపోవడంతో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మతో పాటు మరో గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.