బద్రీనాథ్ యాత్రకు మహా రద్దీ: 30 కి.మీ. ట్రాఫిక్ జామ్‌తో యాత్రికుల నరకయాతన!

Badrinath Yatra Traffic Jam Pilgrims Stranded in Uttarakhand
  • బద్రీనాథ్ యాత్ర మార్గంలో భారీగా నిలిచిన ట్రాఫిక్
  • జోషీమఠ్‌ వద్ద 30 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు
  • తిండి, నీరు లేక గంటల తరబడి యాత్రికుల అవస్థలు
  • ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన అధికారులు
  • వన్‌వే విధానం ద్వారా వాహనాలను పంపిస్తున్న పోలీసులు
పవిత్ర చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్ వెళ్లే మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జోషీమఠ్‌ సమీపంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది యాత్రికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.

చార్‌ధామ్‌తో పాటు హేమకుండ్‌ సాహిబ్‌ యాత్ర కూడా ఒకేసారి ప్రారంభం కావడంతో ఊహించని రీతిలో రద్దీ పెరిగింది. ఫలితంగా విష్ణుప్రయాగ్‌ సహా పలు కీలక ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలడం లేదు. శనివారం ఒక్కరోజే జోషీమఠ్‌ సమీపంలోని 'జీరో బ్యాండ్' వద్ద 8 కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. ఇరుకైన కొండ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో యాత్రికులు తిండి, నీరు, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ రద్దీ కారణంగా అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు సైతం ముందుకు కదలలేని దుస్థితి నెలకొంది. ఈ భీకర ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు జోషీమఠ్‌ వద్ద 'గేట్ సిస్టమ్' (వన్‌వే) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద, ప్రతి 30 నిమిషాలకు ఒకవైపు వాహనాలను మాత్రమే అనుమతిస్తూ నెమ్మదిగా రద్దీని క్లియర్ చేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నందున, యాత్రికులు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
Go Back to Shorts
Badrinath Yatra
Char Dham Yatra
Uttarakhand
Traffic Jam
Joshimath
Hemkund Sahib Yatra
Vishnuprayag
Chardham Pilgrimage
India Tourism

More Telugu News