తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

  • బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తప్పుపట్టిన సీఎం చంద్రబాబు
  • చారిత్రక ప్రాంతాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని హితవు
  • 'గొడ్డలి పార్టీ' అనే పేరుతో వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్న సీఎం
  • వివేకా హత్య కేసులో సునీత పోరాటానికి సంపూర్ణ మద్దతు
  • నియోజకవర్గాలను 50 శాతం పెంచితే రాష్ట్రానికి నష్టం ఉండదని సూచన
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు సంయమనం పాటించాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు. "తెలంగాణ అనే పదం నిఘంటువులోనే లేదు" అంటూ బక్కని ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఈ స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని గుర్తుచేశారు. తెలుగు జాతి ఒక్కటేనని, తెలంగాణలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని స్పష్టం చేశారు.

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్ లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'గొడ్డలి పార్టీ' అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళుతుండటంతో వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబ అరాచకాలు తమకు కూడా పూర్తిగా తెలియవని, ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి పనికిరారని అన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతు తెలిపారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని, ఆమె పోరాటం వల్లే ఈ కేసు ఇంకా సజీవంగా ఉందని అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, అవి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పునర్విభజనలో రాష్ట్రానికి నష్టం జరగకుండా ప్రస్తుతమున్న స్థానాలను 50 శాతం పెంచితే మేలు జరుగుతుందని సూచించారు.

Chandrababu Naidu
Telangana TDP
Bakkani Narasimhulu
Andhra Pradesh Politics
YS Viveka Murder Case
AP Reorganisation
Women's Bill
TDP Cadre
Amaravati
YS Sunitha

More Telugu News