అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు
- 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించామన్న మంత్రి నారాయణ
- వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని వెల్లడి
- తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాల వల్ల తమ కేటాయింపులను రద్దు చేసుకోగా.. మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.
రాజధానిలో భూములు కోరుతూ ముందుకు వచ్చే సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే కేటాయింపులు జరుగుతాయని మంత్రి చెప్పారు. అందుకోసం సదరు సంస్థల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లను సమర్పించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను త్యాగం చేశారని, కానీ గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పనులను నిలిపివేస్తే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని నారాయణ పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రాజధాని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.