రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్

Asaduddin Owaisi Counters Yogi Adityanath on Namaz Ban
  • ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ
  • పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ
  • హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న
  • రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్
రోడ్లపై నమాజ్ వద్దని అంటే, అసలు రహదారులపై మతపరమైన అన్ని కార్యక్రమాలను నిషేధించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రత్యేకించి ముస్లింల పండుగలు, అజాన్, నమాజ్‌ల చుట్టూ ఉద్దేశపూర్వకంగా సమస్యలను సృష్టిస్తూ ముస్లిం సమాజాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.

శుక్రవారం జరిగిన ఒక ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రోడ్లపై నమాజ్ అంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజరవాణాకు అంతరాయం కలిగిస్తూ బహిరంగ రోడ్లపై నమాజ్ ఆమోదయోగ్యం కాదని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఓవైసీ మాట్లాడారు.

 "ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వరకు జరిగే మతపరమైన యాత్రల కోసం రోడ్లను బ్లాక్ చేసి టెంట్లు వేసినప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ముస్లింలు కేవలం శుక్రవారం లేదా పండుగ రోజుల్లో అప్పుడప్పుడు రోడ్లపై నమాజ్ చేస్తేనే సమస్యగా చూస్తున్నారు" అని ఆయన అన్నారు. హిందూ పండుగల సమయంలో మాంసం, గుడ్ల అమ్మకాలపై ఆంక్షలు విధించడాన్ని కూడా తప్పుబట్టారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, ఇదే పద్ధతి పాటించదలిస్తే రంజాన్ మాసం 30 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీవీ చర్చలు, మీడియా నిఘా కారణంగా యువత మరింత ఎక్కువగా మసీదులకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మసీదుల నుంచే ఫత్వాలు జారీ చేసి పోరాడిన అల్లామా ఫజల్ ఎ హక్ ఖైరబాదీ వంటి ఇస్లామిక్ పండితుల త్యాగాలను ఆయన గుర్తుచేశారు.
Go Back to Shorts
Asaduddin Owaisi
Yogi Adityanath
Namaz
Uttar Pradesh
Muslims
Religious freedom
Eid Milap

More Telugu News