గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్!
- ఐపీఎల్ 2026 నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమణ
- క్వాలిఫయర్-2లో 96 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
- జట్టు ఓటమితో డగౌట్లో కన్నీటిపర్యంతమైన యువ కెరటం
- ఈ సీజన్లో 776 పరుగులు, 72 సిక్సర్లతో సంచలనం సృష్టించిన వైభవ్
- ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
చండీగఢ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్తో భారీ స్కోరు సాధించింది. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 104 నాటౌట్), సాయి సుదర్శన్ (58) రాణించడంతో 18.4 ఓవర్లలోనే విజయం సాధించింది.
ఈ సీజన్ ఆసాంతం రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని తన లేత భుజాలపై మోసిన వైభవ్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్లో తలదించుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ.. డగౌట్లో కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు. కెమెరాలకు తన ముఖం కనిపించకుండా టవల్ అడ్డుపెట్టుకుని ఏడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో చేతులు కలిపే సమయంలోనూ అతను తీవ్ర నిరాశతో కనిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులో జట్టు గెలుపు కోసం అతడు చూపించిన కసి, ఆ తర్వాత కార్చిన కన్నీళ్లు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి, అభిమానుల హృదయాలను ద్రవింపజేశాయి. జట్టు ఓడినా, అతని పోరాట స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ అనేకమంది సానుభూతి తెలిపారు.
ఈ సీజన్లో 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు చేసిన వైభవ్, 237కి పైగా స్ట్రైక్ రేట్తో ఏకంగా 72 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అద్భుతాలు చేసి, వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతటి ప్రతిభావంతుడైన యువ ఆటగాడికి భవిష్యత్తు ఉందంటూ క్రీడా నిపుణులు, అభిమానులు ధైర్యం చెబుతున్నారు.
‘వైభవ్ భవిష్యత్తు సూపర్’
జట్టు ఓడిపోయినప్పటికీ ఈ సీజన్లో తమ ప్రదర్శనపై పరాగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. "సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. ఈ సీజన్ మాకు ఎన్నో పాజిటివ్స్ ఇచ్చింది. జట్టులో చాలా మంది యువకులు, అనుభవం లేని వాళ్లు ఉండటం వల్ల మేము అసలు క్వాలిఫై అవుతామని ఎవరూ అనుకోలేదు. కానీ కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఇక్కడి నుంచి మేము మరింత బలంగా తయారవుతాం" అన్నాడు.
ఇదే సమయంలో వైభవ్ సూర్యవంశీపై పరాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "వైభవ్ ఆటను మాటల్లో వర్ణించలేను. అతci ఏదో బ్లైండ్గా బ్యాట్ ఝళిపించే రకం కాదు. చాలా తెలివిగా, లెక్కలు వేసుకుని షాట్లు ఆడతాడు. అతడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. రాజస్థాన్ రాయల్స్కు రెండో ఐపీఎల్ టైటిల్ అందిచడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు" అని పరాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం (31న) జరిగే తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.