ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామ సీరియస్.. ప్రజలకు కీలక సూచన

  • ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామకృష్ణరాజు పోరాటం
  • శబ్ద కాలుష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచన
  • పది రోజుల్లోగా పోలీసులు స్పందించకపోతే తనకు మెయిల్ చేయాలంటూ వెల్లడి
  • అనుమతులు లేకుండా చర్చిలు, ఆలయాలు నిర్మిస్తున్నారని ఆరోపణ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రార్థనా మందిరాల వద్ద లౌడ్‌స్పీకర్ల వల్ల కలిగే శబ్ద కాలుష్యంపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల మోత ఎక్కువగా ఉంటే, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫిర్యాదు ఎలా చేయాలో వివరిస్తూ ఒక నమూనా ఫారమ్‌ను కూడా విడుదల చేశారు.

ఫిర్యాదు చేసిన 10 రోజులలోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే, ఆ ఫిర్యాదు కాపీతో పాటు సంబంధిత ఎస్సై పేరు, ఫోన్ నంబర్‌తో తనకు మెయిల్ చేయాలని రఘురామ సూచించారు. ఇందుకోసం teluguveeralevaraarrr@gmail.com అనే మెయిల్ ఐడీని ఆయన ప్రకటించారు.

గతంలో ప్రజా దర్బార్‌లో చర్చిలు, కొన్ని దేవాలయాల్లోని మైకుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని రఘురామ గుర్తుచేశారు. ఈ క్రమంలోనే తాను ఈ నెల 11న డీజీపీకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశానని తెలిపారు. చట్ట ప్రకారం పరిమిత డెసిబుల్స్‌లో మైకులు వాడాల్సి ఉండగా, చాలాచోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అన్నారు.

కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా జనావాసాల మధ్య చర్చిలు, ఆలయాలు నిర్మిస్తున్నారని రఘురామ ఆరోపించారు. కొత్తగా ప్రార్థనా మందిరాలు నిర్మించాలంటే పంచాయతీ తీర్మానంతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Raghurama Krishnam Raju
AP Assembly
Noise Pollution
Prayer Halls
Loudspeakers
Police Complaint
Pollution Control Board
Church
Temples
Andhra Pradesh

More Telugu News