బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు

  • ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, పంజాబ్‌కు కేవల్ సింగ్ ధిల్లాన్ నియామకం
  • వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక మార్పు
  • హర్యానాకు డాక్టర్ అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్ దేబ్రాయ్ సారథ్యం
  • జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల తర్వాత ఇదే తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం పలు రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

తాజా మార్పుల ప్రకారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ మల్హోత్రాకు ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో ఆయన ఈ పదవిని చేపట్టనున్నారు. హర్యానా బీజేపీ నూతన అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చనా గుప్తాను, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్‌ను, త్రిపుర సారథిగా డాక్టర్ అభిషేక్ దేబ్రాయ్‌ను నియమించారు.

నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో జరిగిన తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ ఇదే కావడం గమనార్హం. ఈ నియామకాల్లో పంజాబ్ అధ్యక్షుడి ఎంపికకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారింది. ప్రస్తుతం ఆప్‌ పాలనలో ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ అవకాశాన్ని అందిపుచ్చుకుని కీలక శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది.

ఈ కొత్త అధ్యక్షులు త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఇతర కేంద్ర నాయకులతో సమావేశం కానున్నారు. వీరి నేతృత్వంలో రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో కొత్త కార్యవర్గాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

BJP
BJP leadership change
Nitin Nabin
Delhi BJP
Haryana BJP
Punjab BJP
Tripura BJP
Indian political parties
Assembly elections

More Telugu News