త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు

  • జులై 1 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం
  • త్రిభాషా సూత్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్
  • రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు
ఎన్‌సీఈఆర్టీలో త్రిభాషా సూత్రానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు నోటీసులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. భాష అనేది ఛాయిస్ అని, దీనిని బలవంతంగా రుద్దలేమని కపిల్ సిబాల్ అన్నారు. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జులై రెండోవారానికి వాయిదా వేసింది.

త్రిభాషా విధానాన్ని అమలు చేయడానికి సీబీఎస్ఈ లాజిస్టికల్ సంసిద్ధతపై నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటీని ఆదేశించింది. మరోవైపు, ఎనిమిదో తరగతి ఎన్సీఈఆర్టీ పుస్తకంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతి విద్యార్థులు రెండు జాతీయ భాషలతో పాటు మొత్తం మూడు భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సీబీఎస్ఈ పేర్కొంది. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు తృతీయ భాషగా దానిని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.

Supreme Court
Three Language Formula
NCERT
CBSE
Justice Surya Kant
Kapil Sibal
Education Policy

More Telugu News