ప్రధాని మోదీతో 20 నిమిషాలు సీఎం విజయ్ భేటీ.. పలు విజ్ఞప్తులు

  • నెదర్లాండ్స్ నుంచి రాగి ఫలకాలను తీసుకువచ్చినందుకు మోదీకి విజయ్ థ్యాంక్స్
  • కర్ణాటకకు మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి
  • ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలన్న సీఎం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కలిశారు. తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానితో 20 నిమిషాల పాటు సమావేశమైన ముఖ్యమంత్రి, తమిళనాడుకు సంబంధించిన వివిధ అంశాలపై విజ్ఞప్తి చేశారు. నెదర్లాండ్స్ నుంచి ఇటీవల పురాతన రాగి ఫలకాలను తిరిగి తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు.

మేకెదాటు ప్రాజెక్టుకు కర్ణాటకకు అనుమతి ఇవ్వవద్దని ప్రధానిని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడులోని దిగువ ప్రాంతాల్లో నీటిలభ్యతపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని కోరారు.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వందేమాతరం గీతాన్ని మొదట పూర్తిస్థాయిలో ఆలపించారు. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, తమిళ గీతాన్ని ఆలపించారు. ఈ నేపథ్యంలో విజయ్ తొలుత రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని కోరారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏకపక్షంగా ఏ ప్రాజెక్టు నిర్మించినా అది కావేరీ జల ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని ప్రధాని మోదీ దృష్టికి సీఎం విజయ్ తీసుకువచ్చారు. అలాంటి మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతించకూడదని కోరారు. ఈ మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరారు.

MK Stalin
Tamil Nadu
Narendra Modi
Mekedatu Project
Cauvery River
Tamil Nadu CM
TN CM Meets PM Modi

More Telugu News