రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి!

  • ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గిరిజనుల వినూత్న నిరసన
  • పదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులు
  • అత్యవసర సమయంలో మంచాలపైనే రోగుల రవాణా
  • నక్సలిజం తగ్గినప్పటికీ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం
‘‘రోడ్లు వేయించడం కుదరకపోతే.. కనీసం హెలికాప్టర్లయినా ఇవ్వండి’’ అంటూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గిరిజన గ్రామ ప్రజలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వినూత్నంగా లేఖ రాశారు. సుక్మా జిల్లాలోని ‘మరుకి’ గ్రామస్థులు తమ ప్రాంతంలో దశాబ్ద కాలంగా అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విలక్షణమైన అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. ఈ వినతికి సంబంధించిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పదేళ్లుగా పూర్తికాని పనులు
మరుకి గ్రామాన్ని అనుసంధానించే రోడ్డు పనులు పదేళ్లుగా అసంపూర్తిగానే నిలిచిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. కాంట్రాక్టర్లు రోడ్డుపై గుంతలు తవ్వి, వంతెనల పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాధారణ రోజుల్లోనే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గ్రామం బాహ్య ప్రపంచంతో పూర్తిగా తెగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంచాలపైనే రోగుల తరలింపు
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వైద్య పరిస్థితుల్లో గ్రామస్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను సంప్రదాయ మంచాలపై (డోలీలు) కిలోమీటర్ల మేర మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకురావాల్సి వస్తోంది. అక్కడికి చేరుకున్న తర్వాతే వారికి అంబులెన్స్ లేదా గాడిరాస్ ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం దొరుకుతుందని గ్రామస్థులు వాపోతున్నారు.

హామీలు కాగితాలకే
ఈ సమస్యపై కింది స్థాయి జిల్లా అధికారుల నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికీ వినతి పత్రాలు సమర్పించామని గ్రామ సర్పంచ్ తెలిపారు. ప్రతిసారీ కేవలం హామీలు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగడం లేదని, తమ బాధలను వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే నది ఘాట్ దాటడం మినహా తమకు మరో మార్గం లేదని పేర్కొన్నారు.

నక్సలిజం తగ్గిన్నా.. మారని రాత
గతంలో ఈ ప్రాంతంలో నక్సలైట్ల వల్లే రోడ్డు పనులు నిలిచిపోయాయని అధికారులు సాకులు చెప్పేవారని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం దాదాపు లేకుండాపోయిందని ప్రభుత్వం ప్రకటిస్తున్న తరుణంలో.. మరి తమ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వినూత్న నిరసనతోనైనా స్థానిక యంత్రాంగం కదిలి, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తుందని వారు ఆశిస్తున్నారు.

Amit Shah
Chhattisgarh
Sukma district
tribal people
road construction
Naxalism
healthcare access
rural development
helicopter request
Maroki village

More Telugu News