ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

Andhra Pradesh Weather Heatwave and Rain Alert Issued
  • ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
  • మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న వడగాల్పుల ప్రభావం
  • ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
  • మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
ఏపీ నిప్పుల కుంపటిలా మండిపోతోంది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఓవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరనున్నాయి. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.

ఒకవైపు ఎండలు మండిస్తుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో వాతావరణం విచిత్రంగా మారింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పగటిపూట తీవ్రమైన ఎండ, సాయంత్రానికి వాతావరణం చల్లబడి పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. గత వారంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ, శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
AP Weather
Andhra Pradesh Weather
Heatwave AP
Thunderstorms Andhra Pradesh
AP Disasters
AP Rain Alert
IMD AP
AP Farmers
AP Temperature
Weather Forecast

More Telugu News