బండి భగీరథ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. కీలకంగా మారిన స్నేహితుల వాంగ్మూలాలు

  • ముగ్గురు యువతులు సహా 10 మంది స్నేహితుల వాంగ్మూలాలు నమోదు
  • భగీరథ్‌ను కస్టడీకి కోరుతూ నేడు పిటిషన్ వేయనున్న దర్యాప్తు బృందం
  • సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా డేటా సేకరణపై పోలీసుల దృష్టి 
  • సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం
సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల సమయంలో భగీరథ్‌తో పాటు ఉన్న స్నేహితుల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ముగ్గురు యువతులు సహా దాదాపు పది మంది స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం కూడా ఇద్దరు యువకులు, ఒక యువతిని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.

గతేడాది అక్టోబర్ 25న నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు, డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి మద్యం మత్తులో తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించిన నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. భగీరథ్, బాధితురాలి మధ్య ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెరిగినందున, వారి సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్‌లను విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను విచారించేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణ మొత్తం మల్కాజిగిరి పోక్సో కోర్టు పరిధిలో జరగనుంది. కేసు తీవ్రత దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

Bandi Bhagirath
Bhagirath POCSO case
Hyderabad POCSO case
Telangana crime news
Petbasheerabad police
Nanakramguda apartment
Moinabad farmhouse
Cyberabad police
Kukatpally DCP

More Telugu News