ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. నారా లోకేష్ దిగ్భ్రాంతి
- కాకినాడ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదం
- రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన టిప్పర్
- అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం
- వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్
- మహిళల మృతి తనను కలచివేసిందన్న లోకేష్
కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీడగ గ్రామానికి చెందిన కొందరు మహిళా కూలీలు ఉపాధి హామీ పనుల కోసం కాలినడకన రోడ్డు దాటుతుండగా, కాకినాడ వైపు నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం అనే నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం ఉదయాన్నే ఉపాధి పనులకు వెళుతూ నలుగురు మహిళా కార్మికులు ఇలా దుర్మరణం పాలవ్వడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి, కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కూలీలను కాకినాడ సర్వజనాస్పత్రికి తరలించగా, వారికి మెరుగైన అత్యవసర వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాకినాడ రూరల్ పోలీసులు పరారైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.