ఇంధన పొదుపు... కాన్వాయ్ వదిలేసి బైక్ పై ప్రయాణించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

  • శాసన మండలికి బైక్‌పై వచ్చిన సీఎం ఫడ్నవీస్
  • ఇంధన ఆదాపై ప్రధాని మోదీ పిలుపునకు స్పందన
  • మంత్రుల కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు
  • అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు
  • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ పొదుపు చర్యలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన అధికారిక నివాసం నుంచి విధాన్ భవన్‌కు బైక్‌పై ప్రయాణించారు. ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ఫడ్నవీస్ ఈ విధంగా తన వంతు సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు.

గురువారం జరిగిన శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు, ఫడ్నవీస్ బీజేపీ నేత, మంత్రి ఆశీష్ షెలార్‌తో కలిసి బైక్‌పై వెళ్లారు. దాంతో ఫడ్నవీస్ భద్రతా సిబ్బంది కూడా ఆయనను బైక్ లపై అనుసరించారు. ఈ ప్రయాణంలో ఫడ్నవీస్ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 (స్టెల్త్ బ్లాక్ కలర్) బైక్ ను ఉపయోగించారు. ఇదే స్ఫూర్తితో మరో మంత్రి నితేష్ రాణే సచివాలయానికి ఏకంగా నడిచి రావడం విశేషం.

ఇంధన పొదుపు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయించారు. అంతేకాకుండా మంత్రులు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేశారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించిన వాహనాలపైనా సమీక్ష జరుపుతామని స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇంధనంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఆ ప్రాంతంపైనే ఎక్కువగా ఆధారపడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాయి.

Devendra Fadnavis
Maharashtra CM
Fuel Conservation
Bike Ride
Narendra Modi
Energy Saving
Ashish Shelar
Nitesh Rane
Mumbai
Government Initiatives

More Telugu News