ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Promotes New Reality of Work From Home
  • వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపు
  • పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని 8 సూచనలను పాటిద్దామన్న ముఖ్యమంత్రి
  • పెట్రోల్ వాడకం, విదేశీ పర్యటనలు తగ్గించుకుని దుబారాకు అడ్డుకట్ట వేయాలని సూచన
  • అమరావతిలో బైసర్ ఇనిస్టిట్యూట్, కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
  • క్వాంటమ్ వ్యాలీతో అమరావతి నుంచి ప్రపంచానికి కంప్యూటర్లు అందిస్తామన్న సీఎం
ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తోందని, ఈ నూతన వాస్తవికతను అందరూ ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోనూ భవిష్యత్తులో ఈ తరహా విధానాన్ని అమలు చేసే అవకాశాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి ఇచ్చిన 8 పొదుపు సూచనలను రాష్ట్ర ప్రజలందరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 

అమరావతిలోని నిడమర్రులో బుధవారం బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బైసర్) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రధాని సూచనల మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని చంద్రబాబు అన్నారు. "దేశం మొత్తం దుబారాను తగ్గించాలి. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లడం ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రజాప్రతినిధులు కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ఆదర్శంగా నిలవాలి. భద్రతను కూడా కుదించుకోవాలి" అని ఆయన హితవు పలికారు. 

విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లపై కూడా ప్రజలు ఆలోచించాలని సూచించారు. మన దేశంలో, రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని, విదేశాలకు బదులు స్వదేశీ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు ఎంతో అందమైనవని, సూర్యలంకను గోవాను మించిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. "నా దేశం - నా బాధ్యత" అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు.

అమరావతికి వైద్య, విద్య హబ్ గుర్తింపు


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులన్నీ ఆటోపైలట్ మోడ్‌లో ఇచ్చే బాధ్యత తమదని, పారిశ్రామికవేత్తలు వేగంగా నిర్మాణాలు పూర్తిచేసి కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. 

"ప్రపంచంలోని ప్రతి ముగ్గురు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిలో ఒకరు అమరావతి నుంచే తయారుకావాలి," అని ఆయన తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. బైసర్, కిమ్స్ సంస్థలు ఈ లక్ష్య సాధనకు దోహదపడతాయన్నారు. 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 250 మెడికల్ సీట్లు, నైపుణ్యాభివృద్ధి ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించేలా ఈ సంస్థలు విస్తరించనున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఇదే రోజున కిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

క్వాంటమ్ వ్యాలీతో కొత్త శకం

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని, ఇది దేశంలోనే ఒక నూతన అధ్యాయమని చంద్రబాబు అన్నారు. "ఈ ఏడాది డిసెంబర్ నాటికి మన దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌కు ఏపీ చిరునామాగా మారుతుంది. రెండేళ్లలో అమరావతి నుంచి ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు సరఫరా చేస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, తన జీవితంలో అలాంటి అరాచక పాలనను చూడలేదని విమర్శించారు. తన ప్రభుత్వ లక్ష్యం పిల్లల భవిష్యత్తు, యువతకు ఉద్యోగాలేనని స్పష్టం చేశారు.

గత పాలకులు ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం మోపారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చార్జీలు పెంచలేదని, భవిష్యత్తులో కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, విశాఖను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్, టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని, 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 24 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
Quantum Valley
Skill Development
Economic Development
Foreign Investments
Employment Opportunities
Green Energy
Tourism

More Telugu News