రాసి పెట్టుకోండి.. ధూళిపాళ్ల ఓడిపోవడం ఖాయం: అంబటి రాంబాబు
- చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్
- రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్న
- లోకేశ్, పెమ్మసాని ఏం చెబితే ఐజీ అది చేస్తున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లి ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ వైసీపీ చేపట్టిన 'చలో మామిళ్లపల్లి' కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు... ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై విరుచుకుపడ్డారు.
రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. "వచ్చే ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం, ఇది రాసుకోండి" అంటూ మూడేళ్ల ముందే ఆయన జోస్యం చెప్పారు. రైతుల కాలి ధూళికి ఆయన కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.
మా కుటుంబంపై, మా కులంపై , మా పార్టీపై కక్ష కట్టి ఇలాంటి దాడులు చేస్తున్నారా అని అంబటి నిలదీశారు. గుంటూరు ఐజీ త్రిపాఠి ఖాకీ డ్రెస్ వేసుకోవడం లేదని, పచ్చ డ్రెస్ (టీడీపీ రంగు) వేసుకుంటున్నారని ఆరోపించారు. లోకేశ్, పెమ్మసాని ఏం చెబితే ఐజీ అది చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేస్తే ఎంతటి పెద్ద అధికారినైనా చట్టప్రకారం శిక్షిస్తామని, తప్పుడు కేసులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గోడౌన్లో సీజ్ చేసిన మొక్కజొన్నను వెంటనే విడుదల చేయాలని కోరారు. అరెస్టులకు భయపడేది లేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.