భారత్‌ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు: అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • 1998 పోక్రాన్ అణు పరీక్షలను గుర్తుచేస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు
  • సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
  • బుజ్జగింపు రాజకీయాలపై ప్రతిపక్షాలను విమర్శించిన మోదీ
  • సోమనాథ్ పునరుద్ధరణ భారత సాంస్కృతిక స్వేచ్ఛకు ప్రతీక అని వెల్లడి
భారత్‌ను తలవంచేలా చేసే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 1998లో పోక్రాన్‌లో జరిపిన అణు పరీక్షలను గుర్తుచేస్తూ, భారత సంకల్పం ఎంత దృఢమైనదో ప్రపంచానికి ఆనాడే తెలిసొచ్చిందని అన్నారు. సోమవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో జరిగిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్' వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

1998 మే 11న భారత శాస్త్రవేత్తలు పోక్రాన్‌లో అణు పరీక్షలు జరిపి దేశ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలు మనపై అనేక ఆంక్షలు విధించి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూశాయని అన్నారు. అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదని, మే 13న మరోసారి పరీక్షలు జరిపి తన రాజకీయ సంకల్పాన్ని నిరూపించుకుందని వివరించారు. "మనం వేరే మట్టితో తయారైన వాళ్ళం" అంటూ ఆనాటి ధైర్యాన్ని కొనియాడారు.

సోమనాథ్ ఆలయం గురించి మాట్లాడుతూ.. 75 ఏళ్ల క్రితం జరిగిన ఆలయ పునరుద్ధరణ కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదని, అది భారత సాంస్కృతిక స్వేచ్ఛా ప్రకటన అని మోదీ అభివర్ణించారు. చరిత్రలో ఎన్నోసార్లు ఆలయాన్ని ధ్వంసం చేసినా, ప్రతిసారీ పునర్నిర్మించామని, ఇది భారత విశ్వాసానికి ఉన్న బలమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయ నిర్మాణంలోనూ బుజ్జగింపు రాజకీయాలు జరిగాయని, సర్దార్ పటేల్ వంటి వారి ప్రయత్నాలను నెహ్రూ వ్యతిరేకించారని విమర్శించారు. ఇదే తరహా రాజకీయాలు అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలోనూ కొనసాగాయని అన్నారు.

పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆలయంలో విశేష మహా పూజ, కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హెలికాప్టర్ల ద్వారా ఆలయ గోపురంపై పూలవర్షం కురిపించారు.

Narendra Modi
Pokhran nuclear test
Somnath Temple
Gujarat
India power
Indian scientists
Amrit Mahotsav
Sardar Patel
Ayodhya Ram Mandir
Nehru

More Telugu News