మా ఇంటికి వచ్చి ప్రధాని చూపిన ఆప్యాయత మరువలేనిది: సీఎం చంద్రబాబు

  • హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ
  • గంటకు పైగా సీఎం నివాసంలో గడిపిన ప్రధాని
  • ఇది తమ కుటుంబానికి చిరస్మరణీయ సాయంత్రమన్న చంద్రబాబు
  • ప్రధాని ఆప్యాయత, ప్రోత్సాహం మరువలేనిదన్న సీఎం
  • చంద్రబాబు నివాసంలోని సీతారాములకు మోదీ పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన సాయంత్రమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయత, కుటుంబ సభ్యులతో ఆయన కలివిడిగా మాట్లాడిన తీరు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ పర్యటనకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహానికి ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

"ఈ సాయంత్రం మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన ఒక మధురానుభూతిని మిగిల్చింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈరోజు మా నివాసంలో ఆతిథ్యం ఇవ్వడం ఒక గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఆయన చూపిన ఆత్మీయత, ఆప్యాయత, మాతో ఎంతో ఉదారంగా సంభాషించిన తీరు ఈ సందర్భాన్ని మా అందరికీ ఎంతో ప్రత్యేకంగా మార్చాయి. ఆయనతో గడిపిన ప్రతి క్షణం మాకు చాలా విలువైంది.
మా ఆహ్వానాన్ని మన్నించి, ఎంతో దయతో మా నివాసానికి వచ్చినందుకు గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు కూడా ధన్యవాదాలు" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. సుమారు గంటా పది నిమిషాల పాటు చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ, అక్కడి సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెస్ లో విశేషంగా రాణిస్తున్న నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ను అభినందించారు.

అనంతరం, చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడంపై చంద్రబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Chandrababu Naidu
Narendra Modi
Andhra Pradesh
AP Development
Nara Lokesh
Devansh Nara
Hyderabad Visit
AP Politics
Prime Minister Modi
Telugu News

More Telugu News