ఆ ఖర్చు తగ్గితేనే ఏపీకి గరిష్ఠ ప్రయోజనం: జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
- రవాణా వ్యయం తగ్గితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం
- లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడి
- ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన
- త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంకేతాలు
- పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ పెంచాలని ఆదేశం
ప్రస్తుతం రైలు మార్గంలో కిలోమీటరుకు రూ. 1.83 ఖర్చవుతుండగా, రోడ్డు మార్గంలో ఇది రూ. 3.40గా ఉందని చంద్రబాబు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారానే అభివృద్ధిని మరింత వేగవంతం చేయగలమని తెలిపారు. పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ తప్పనిసరిగా పెరగాలన్నారు. రాష్ట్రానికి రూ. లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు, రూ. 64 వేల కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడించారు. మరో రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయని చెప్పారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలను (ఆర్వోబీ) యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, కలెక్టర్లు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వర్షాధార, మెట్ట, ఉద్యాన పంటలకు అనుగుణంగా నీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పశువుల దాణాకు కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఆయన సంకేతాలిచ్చారు. గ్రీన్ కవర్ పెంచాలని అటవీ శాఖను ఆదేశించిన సీఎం, స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ, రహదారుల శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.