రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత
- 11,482 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సునీత
- 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్ల పంపిణీ
- భూమి పత్రాలపై జగన్ ఫొటో వేయించుకోవడంపై మండిపాటు
రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతుల భూముల విషయంలో జరిగిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, సొంత భూమి పత్రాలపై జగన్ మోహన్ రెడ్డి తన ఫొటో వేయించుకోవడంపై మండిపడ్డారు. చెన్నేకొత్తపల్లి, వెల్దురి, బ్రాహ్మణపల్లి పంచాయతీలకు చెందిన దాదాపు 11,482 మంది రైతులకు ప్రభుత్వం అధికారిక ముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందించారు.
అదేవిధంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్లను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 8 వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చేందుకు కూడా సంస్థ ముందుకు వచ్చిందని వెల్లడించారు. వీటితో పాటు ఐకేపీ యానిమేటర్లకు సెల్ఫోన్లు, ఐదుగురు లబ్ధిదారులకు రూ.2.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పెద్ద సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు.