సింగపూర్ బాటలో ఏపీ ఉపాధ్యాయులు.. విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం

  • 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్‌లో అంతర్జాతీయ శిక్షణ
  • ముఖ్యమంత్రి 'ఫ్యూచర్ రెడీ' విజన్‌లో భాగంగా కీలక కార్యక్రమం
  • పాఠశాల విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యం
  • శిక్షణ తర్వాత టీచర్లు మెంటార్లుగా మారి తోటి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం
  • తదుపరి బృందాన్ని ఫిన్‌లాండ్‌కు పంపేందుకు ప్రభుత్వ ప్రణాళిక
ఏపీ పాఠశాల విద్యారంగంలో సరికొత్త శకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా, బోధనా నాణ్యతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఒక బృహత్తర కార్యక్రమానికి అడుగులు వేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ ఇప్పించి, వారిని గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో 37 మందిని 'అంతర్జాతీయ శిక్షణా పర్యటన'కు ఎంపిక చేశారు. సీఎం చంద్రబాబు 'ఫ్యూచర్ రెడీ' దార్శనికతకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నాయకత్వానికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ వేదికపై ఎవరితోనైనా పోటీపడగల సత్తా సాధించాలని, అందుకు పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది పడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ
ఈ చొరవలో మొదటి దశగా 37 మంది ఉపాధ్యాయులతో కూడిన బృందం సింగపూర్‌కు బయలుదేరింది. అక్కడ ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ)లో మే 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు "డిజైనింగ్ లెర్నింగ్, ఇన్‌స్పైరింగ్ థింకింగ్" అనే అంశంపై ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. విద్యా విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసంధానించాలన్న మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవతో సింగపూర్ ఎన్ఐఈ, ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కు వంటి సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదిరాయి. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించేవారిగా కాకుండా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను ప్రేరేపించే అభ్యాస మార్గదర్శకులుగా మార్చడమే ప్రధాన ఉద్దేశం.

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
ఈ బృందం ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తిగా మెరిట్ ఆధారంగా జరిగింది. ఇందులో 10 మంది ప్రధానోపాధ్యాయులు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు ప్రిన్సిపాల్స్, ఐదుగురు ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో 17 మంది మహిళలు ఉండటం గమనార్హం. శిక్షణలో భాగంగా సింగపూర్ విద్యా వ్యవస్థ, బోధనా రూపకల్పన పద్ధతులు, యిషున్ సెకండరీ స్కూల్ సందర్శన వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు.

ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ... "ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో, విద్యాశాఖ మంత్రి పర్యవేక్షణలో ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. ఇది కేవలం పర్యటన కాదు, మన విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పునకు నాంది. ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయికి చేర్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంది" అని వివరించారు.

స్థానిక పాఠశాలల్లో అమలు
శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. అంతేగాక తోటి ఉపాధ్యాయులకు మెంటార్లుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న ప్రపంచస్థాయి పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా తరగతి గదుల్లోకి తీసుకెళ‌తారు. ఈ కార్యక్రమం తర్వాత మరో 29 మంది ఉపాధ్యాయులతో కూడిన తదుపరి బృందాన్ని ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కుకు పంపేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP 2020) లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం బలమైన పునాది వేస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

AP Teachers
Andhra Pradesh Education
Nara Lokesh
Singapore Education System
NIE Singapore
Future Ready
Global Education Leaders
Teacher Training
AP Schools
Education Policy

More Telugu News