భారత్‌పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం!

  • భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆరోపణలు
  • టీటీపీ, బీఎల్ఏ దాడుల వెనుక భారత్ ఉందని కొత్త ప్రచారం
  • లష్కర్, జైష్ ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టడమే అసలు లక్ష్యం
  • ఆపరేషన్ సిందూర్ వైఫల్యంతో పరువు కాపాడుకునే ప్రయత్నం
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, భారత్‌పై సరికొత్త కుట్రపూరిత వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తన దేశంలో తెహ్రీక్-ఏ-తాలిబన్ (టీటీపీ), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జరుపుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్థాన్ స్వయంకృతాపరాధమే ఈ సమస్యలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా, మునీర్ ఈ ప్రచారాన్ని ఉధృతం చేయడం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలను మళ్లీ భారత్‌పై దాడులకు ఉసిగొల్పడమే ఆయన అసలు ఉద్దేశం. 

'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ సైన్యం పరువు కోల్పోవడంతో, ఆసిమ్ మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌కు ముందు, "భారత్‌ను తూర్పు నుంచి నాశనం చేయడం ప్రారంభిస్తాం" అంటూ ఆయన గంభీరమైన ప్రకటనలు చేశారు. అయితే, ఆ ఆపరేషన్ విఫలమవడంతో ఇప్పుడు సొంత దేశంలో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ అవమానం నుంచి బయటపడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ భారత్‌పై నిందలు మోపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం జైష్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు పునరేకీకరణ అవుతున్నప్పటికీ ఆ ప్రక్రియ పాక్ సైన్యం, ఐఎస్ఐ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఐఎస్ఐ నిధులు, వనరులు సమకూరుస్తున్నా, ఆ సంస్థల నాయకత్వంలో నైతిక స్థైర్యం కొరవడిందని, భారత్‌పై వెంటనే దాడులు చేసేందుకు అవి విముఖంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో భారత్‌పై ద్వేషాన్ని మరింత తీవ్రతరం చేసి, దాడులకు పురిగొల్పేందుకే మునీర్ ఈ ఆరోపణల పర్వాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లతో యుద్ధం విషయంలోనూ మునీర్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా భారత్‌పై విమర్శలు ఆయనకు ఒక ఆయుధంగా మారాయి. కశ్మీర్‌లో దాడులు చేయడంలో అనుభవం ఉన్న లష్కర్, జైష్‌లను రంగంలోకి దించకుండా పాకిస్థాన్ తన ప్రాక్సీ యుద్ధాన్ని కొనసాగించలేదు. అందుకే ఆ సంస్థలలో మళ్లీ కసి రగిలించేందుకు మునీర్ ఈ ప్రచారాన్ని వాడుకుంటున్నారు.

భారత సైన్యం సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండటంతో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అయినప్పటికీ, పాకిస్థాన్ నిస్పృహలో ఉందని, మునీర్ రెచ్చగొట్టే ప్రసంగాల నేపథ్యంలో కశ్మీర్‌లో ఒక భారీ దాడికి తెగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Asim Munir
Pakistan
India
Terrorism
ISI
Jaish-e-Mohammed
Lashkar-e-Taiba
Kashmir
TTP
BLA

More Telugu News