లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం

  • మళ్లీ తెరపైకి భారత్-నేపాల్ సరిహద్దుల పంచాయితీ
  • కైలాస యాత్రకు లిపులేఖ్ పాస్ వినియోగంపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం
  • లిపులేఖ్ తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా వాడొద్దని స్పష్టీకరణ
  • 1954 నుంచి ఈ మార్గాన్ని వాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడి
  • 2020లో భారత్ రోడ్డు నిర్మించడంతో తీవ్రస్థాయికి వివాదం
కైలాస మానస సరోవర యాత్ర విషయంలో భారత్, నేపాల్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. యాత్ర కోసం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గాన్ని ఉపయోగించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రాంతం తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఖాట్మండూలో నేపాల్ విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏమిటీ వివాదం?
ప్రతిష్ఠాత్మకమైన కైలాస మానస సరోవర యాత్ర-2026ను జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించింది. సిక్కింలోని నాథూ లా, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ అనే రెండు మార్గాల ద్వారా యాత్ర కొనసాగుతుందని తెలిపింది. ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ నిర్ణయంపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమతో సంప్రదించకుండా, తమ భూభాగంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈ అంశాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత్, చైనా దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది.

భారత్ స్పందన
నేపాల్ అభ్యంతరాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. లిపులేఖ్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, అందులో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. 1954 నుంచి కైలాస యాత్రకు ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నామని, ఇది కొత్త పరిణామం కాదని పేర్కొంది. నేపాల్ ప్రాదేశిక వాదనలకు చారిత్రక ఆధారాలు లేవని, ఏకపక్షంగా సరిహద్దులను విస్తరించుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అయితే, సరిహద్దు వివాదాలు సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

నేపథ్యం
1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నదికి తూర్పున ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తోంది. అయితే, 2020లో లిపులేఖ్ కనుమ వరకు భారత్ 80 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించడంతో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

Nepal
Lipulekh Pass
Kailash Mansarovar Yatra
India Nepal Border Dispute
Kalapani
Limpiyadhura
Kailash Yatra
India China
Ranadhir Jaiswal
Sugauli Treaty

More Telugu News