ఐపీఎల్‌లో భారీ డీల్.. మిట్టల్ ఫ్యామిలీ చేతికి రాజస్థాన్ రాయల్స్‌.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్

  • రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యజమానులు
  • లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 75 శాతం వాటా
  • ఈ డీల్‌లో భాగస్వామిగా చేరిన అదర్ పూనావాలా
  • దాదాపు రూ. 13,700 కోట్లుగా ఫ్రాంచైజీ విలువ
  • జట్టులో 75 శాతం వాటా మిట్టల్ కుటుంబానికి సొంతం
  • నిధుల సమస్యతో వెనక్కి తగ్గిన కల్ సోమానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసింది. ఈ భారీ ఒప్పందంలో 'వ్యాక్సిన్ ప్రిన్స్' అదర్ పూనావాలా కూడా భాగస్వామిగా చేరారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది.

ఈ ఒప్పందం పూర్తయ్యాక రాజస్థాన్ రాయల్స్‌లో మిట్టల్ కుటుంబానికి సుమారు 75 శాతం వాటా ఉంటుంది. అదర్ పూనావాలాకు 18 శాతం, మనోజ్ బడాలే సహా ప్రస్తుత పెట్టుబడిదారులకు 7 శాతం వాటా కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్ మెన్స్ ఫ్రాంచైజీ, దక్షిణాఫ్రికాలోని పార్ల్ రాయల్స్, కరీబియన్‌లోని బార్బడోస్ రాయల్స్‌తో కలిపి ఈ మొత్తం డీల్ విలువ సుమారు 1.65 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 13,700 కోట్లు) అని అంచనా.

గతంలో కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా, నిధుల సమీకరణలో విఫలం కావడంతో ఆ ఒప్పందం ముందుకు సాగలేదు. ఫ్రాంచైజీ వ్యవస్థాపకుల్లో ఒకరైన బడాలే.. తన అనుభవంతో జట్టుకు మద్దతుగా కొనసాగుతారని యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ, "నాకు క్రికెట్ అంటే ఇష్టం, మా కుటుంబం రాజస్థాన్‌కు చెందినది. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగం కావడం కంటే సంతోషం మరొకటి లేదు" అని అన్నారు. ఫ్రాంచైజీ వారసత్వాన్ని కొనసాగిస్తామని, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తామని ఆదిత్య మిట్టల్ తెలిపారు.

బీసీసీఐ, సీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అవసరమైన అనుమతులు లభించిన తర్వాత ఈ కొనుగోలు ప్రక్రియ 2026 మూడో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉంది.

కాగా, కరోనా సమయంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీతో ప్రపంచం దృష్టించిన ఆకర్షించి 'వ్యాక్సిన్ ప్రిన్స్' గా సుప్రసిద్ధుడైన అదర్ పూనావాలా కూడా ఈ డీల్ లో భాగస్వామి కావడం విశేషం. 

Adar Poonawalla
Rajasthan Royals
IPL
Lakshmi Mittal
Indian Premier League
Manoj Badale
vaccine prince
covishield
Aditya Mittal
sports

More Telugu News