ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు

  • బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో ఆత్మీయ పలకరింపు
  • చంద్రబాబు కనిపించగానే దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని ఎర్రబెల్లి పలకరింపు
  • ఎర్రబెల్లి భుజం తట్టి, నమస్కరించిన చంద్రబాబు
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. హైదరాబాద్‌లో ఈరోజు జనని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురుపడ్డారు. వేడుకకు హాజరయ్యేందుకు ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో వచ్చారు. రాజకీయాలను పక్కనపెట్టి వారు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

చంద్రబాబు కనిపించగానే ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరకు వెళ్ళి, ఆయన చేతులు పట్టుకుని కాస్త వంగి నమస్కరించారు. చంద్రబాబు ఆయన భుజం తట్టి, నమస్కరించారు. దీంతో ఎర్రబెల్లి కూడా ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి అక్కడి నుంచి ముందుకు కదిలారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నేతృత్వంలో సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం టీడీపీలోనే ఉన్నప్పటికీ, ఆ తర్వాత టీఆర్ఎస్ (నేటీ బీఆర్ఎస్)లో చేరారు. బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, శివాజీ, కోన వెంకట్, సి. కల్యాణ్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు హాజరయ్యారు.

Chandrababu Naidu
Errabelli Dayakar Rao
Bandla Ganesh
Janani engagement
Telugu Desam Party

More Telugu News