యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు

  • నామకరణ వేడుకలో విషాదం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి
  • నిందితుడిని అరెస్ట్ చేసి, తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యంలో కలిపేందుకు నీళ్లు తీసుకురాలేదన్న చిన్న కారణంతో 9 ఏళ్ల బాలుడిని బంధువే కాల్చి చంపాడు. కాస్‌గంజ్‌ జిల్లాలోని యాకుత్‌గంజ్ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌గంజ్ గ్రామంలోని జస్వీర్ గోలా ఇంట్లో నామకరణ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు. ఇదే సమయంలో జస్వీర్ బంధువైన ధనేశ్ యాదవ్ మద్యం తాగుతున్నాడు. అక్కడే ఆడుకుంటున్న జస్వీర్ కుమారుడిని పిలిచి మద్యం కలుపుకోవడానికి నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. అందుకు ఆ బాలుడు నిరాకరించాడు.

దీంతో మద్యం మత్తులో ఉన్న ధనేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న తుపాకితో బాలుడి కడుపులో కాల్చాడు. ఈ ఘటనతో వేడుకలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని మొదట కాస్‌గంజ్‌ జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో అలీగఢ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఖితౌలీ కాలువ వంతెన వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవింద్ వల్లభ్ శర్మ తెలిపారు. నిందితుడిని జైలుకు పంపే ప్రక్రియ ప్రారంభించామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్పీ రాజేశ్ కుమార్ భారతి వెల్లడించారు.

Dhanesh Yadav
Uttar Pradesh
Kasganj
child murder
crime news
alcohol
Yaqutganj village
firearm
UP police
India

More Telugu News