రికార్డుల మోత మోగిస్తున్న ఫోన్‌పే.. 70 కోట్లు దాటిన యూజర్ల సంఖ్య!

PhonePe surpasses 700 million registered users accelerates growth momentum
  • 70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మైలురాయిని దాటిన ఫోన్‌పే
  • భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త రికార్డు
  • ప్రతి ఆరు రోజులకు 10 లక్షల మంది కొత్తగా రిజిస్టర్
  • గత రెండేళ్లలో 56 శాతం పైగా స్థిరమైన వార్షిక వృద్ధి
  • వినియోగదారుల నమ్మకానికి ఇది నిదర్శనమన్న సీఈవో సమీర్ నిగమ్
భారత డిజిటల్ పేమెంట్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే (PhonePe) సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న‌టితో తమ ప్లాట్‌ఫామ్‌పై రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 70 కోట్లు (700 మిలియన్లు) దాటినట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. దేశ జనాభాలో ఇంత భారీ స్థాయిలో యూజర్లను కలిగి ఉండటం, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీలో ఫోన్‌పే ఎంతగా విస్తరించిందో తెలియజేస్తోంది.

ప్రతి 6 రోజులకు 10 లక్షల కొత్త యూజర్లు 
ఫోన్‌పే వృద్ధి ప్రయాణంలో సాధించిన వేగం అత్యంత ఆసక్తికరంగా ఉంది. సంస్థ ప్రారంభమైనప్పుడు మొదటి 10 లక్షల మంది వినియోగదారులను చేరడానికి 136 రోజులు పట్టింది. కానీ, ప్రస్తుతం కేవలం 6 రోజుల్లోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో చేరుతున్నారని కంపెనీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు, ఫోన్‌పే 56.25 శాతం స్థిరమైన వార్షిక వృద్ధి రేటును (CAGR) నమోదు చేసింది. ఇది కంపెనీ ఎంత వేగంగా, స్థిరంగా విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. వినియోగదారుల నమ్మకం, మార్కెట్-లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, సులభమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.

వినియోగదారుల నమ్మకమే మా బలం: ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ 
ఈ మైలురాయిపై ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ మాట్లాడుతూ... “70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మార్కును దాటడం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దేశవ్యాప్తంగా వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. నేటి ఆధునిక జీవితంలో డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యత ఎంతగా పెరిగిందో మా వృద్ధి వేగమే తెలియజేస్తోంది. భవిష్యత్తులో కూడా అందరికీ సులభమైన, సురక్షితమైన, అందుబాటులో ఉండే ఉత్పత్తులను రూపొందించడంపై మా దృష్టి ఉంటుంది. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మా వంతు సహకారం అందిస్తూనే ఉంటాం" అని వివరించారు.

భారతదేశంలో డిజిటల్ వ్యవస్థ స్వీకరణ పెరుగుతున్న నేపథ్యంలో తమ సేవలను మరింత విస్తరించాలని, భారతీయుల కోసం మరిన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని ఫోన్‌పే లక్ష్యంగా పెట్టుకుంది.
Go Back to Shorts
PhonePe
Registered users
Sameer Nigam
India

More Telugu News