ఉద్యమకారుడైన తండ్రిని విమర్శించి కవిత మర్యాద పోగొట్టుకున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • తండ్రికి విలువ ఇవ్వని ఆమె తెలంగాణ అమ్మ ఎలా అవుతుందని ప్రశ్న
  • డబ్బులుంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయిందని ఎద్దేవా
  • అన్నమీద కోపంతో తండ్రిని విమర్శించడం సరికాదని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తన తండ్రి కేసీఆర్‌ను విమర్శించి మర్యాద పోగొట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడని, అలాంటి వ్యక్తిని తన మొదటి సమావేశంలోనే విమర్శించడం బాధేసిందని అన్నారు. కవిత తన పార్టీ ప్రకటన సమయంలో పలుమార్లు తనను తాను అమ్మగా చెప్పుకున్నారని, కానీ తండ్రికి విలువ ఇవ్వని ఆమె తెలంగాణకు అమ్మ ఎలా అవుతారని ప్రశ్నించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డబ్బులు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయిందని వ్యాఖ్యానించారు. కవితతో "ఊదు కాలదు, పీరు లేవదు" అని తెలంగాణలోని నానుడిని పేర్కొన్నారు. అన్నమీద ఉన్న కోపాన్ని కవిత తన తండ్రి మీద చూపించడం సరికాదని అన్నారు. ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపు ఉందని, కానీ ఆమె పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని అన్నారు.

టీఆర్ఎస్ పేరు మీదే పార్టీ పెట్టడం హాస్యాస్పదమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదని ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి అంశంపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని అన్నారు. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని అన్నారు.

Komatireddy Venkat reddy on Kavitha TRS
Congress Leader Komatireddy Venkat Reddy

More Telugu News