ఈటీవీ విన్ లో 'ఆమెకథ' .. ఎలా ఉందంటే..!

  • ఆమని ప్రధానమైన పాత్రగా 'ఆమె కథ'
  • కీలకమైన పాత్రను పోషించిన దేవీ ప్రసాద్
  • అంతగా ఆకట్టుకోని కథాకథనాలు 
  • కృతకంగా అనిపించే సన్నివేశాలు

తెలుగు తెరపై కథనాయికగా ఆమని చాలానే సినిమాలు చేశారు. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె బిజీగానే ఉన్నారు. బరువైన పాత్రలను చేయడంలో మంచి అనుభవం ఉన్న నటిగా ఆమెకి పేరు ఉంది. అలాంటి ఆమని ప్రధానమైన పాత్రగా రూపొందినదే 'ఆమెకథ'. 'కథాసుధ' శీర్షిక క్రింద, ఈ నెల 25వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో 'ఆమె కథ' స్ట్రీమింగ్ అవుతోంది. ఆమని భర్తగా దేవీప్రసాద్ నటించిన ఈ ఎపిసోడ్ కి, గట్రెడ్డి హరి దర్శకత్వం వహించాడు. 

అమ్మణ్ణి (ఆమని) ఆమె భర్త (దేవీ ప్రసాద్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలు. కొడుకు కోడలితో కలిసి విజయవాడలో నివసిస్తూ ఉంటారు. అమ్మణ్ణికి ఒక కోరిక బలంగా ఉంటుంది. తన రూమ్ లో ఏసీ పెట్టించుకోవాలనేది ఆమె ఎప్పటి నుంచో కంటున్న కల. ఆ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో, ఆమె నుంచి భర్తకి మరింత ఒత్తిడి ఎక్కువవుతుంది. అమ్మణ్ణి కల నిజమవుతుందా? ఆమె ముచ్చటను భర్త తీర్చగలుగుతాడా? అనేది ఆడియన్స్ ఆసక్తితో ఎదురుచూసే విషయం.
        
ఈ తరహా పాత్రలు పోషించడంలో ఆమనికి మంచి అనుభవం ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆమె పాత్ర మనకి కనెక్ట్ కాదు. అందుకు కారణం, కథలో సహజత్వం లోపించడం. లాజిక్ కి దూరంగా ఆ కథ నడవడం. అమ్మణ్ణి వాళ్ల కుటుంబ పరిస్థితి చూస్తే, ఎప్పటి నుంచో ఏసీ కొనుక్కోలేకపోయిన ఫ్యామిలీగా ఏమీ అనిపించదు. ఇక ఏసీ కోసం ఆమె పట్టుబట్టే తీరు, దాని కోసం పడే ఆరాటం కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోగా అసహనాన్ని కలిగిస్తుంది. 

కొడుకు కోడలు ధోరణి .. వాళ్ల తీరుపట్ల అమ్మణ్ణి ఆవేదన చెందడం వంటి సన్నివేశాలు, ఆ సన్నివేశాలకు రాసుకున్న సంభాషణలు కూడా చాలా కృతకంగా అనిపిస్తాయి. ఆమని పాత్ర .. ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు మొదలు, క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఆమని - దేవీ ప్రసాద్ మంచి ఆర్టిస్టులే. అయితే కంటెంట్ బలహీనంగా ఉండటం వలన, ఆ పాత్రలు ఆడియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయని చెప్పచ్చు. 


-

More Telugu News