టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం
- 'చీన్ టపాక్ డుం డుం' అనే చిత్రం ద్వారా మాధురి టాలీవుడ్ ఎంట్రీ
- గైరమ్మత్త అనే పవర్ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్న మాధురి
- సినిమా ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన సినీ ప్రముఖులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాప్యులర్ అయిన మాధురి... ఇప్పుడు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘చీన్ టపాక్ డుం డుం’ అనే విభిన్నమైన టైటిల్తో వస్తున్న చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాలో మాధురి ‘గైరమ్మత్త’ అనే గంభీరమైన పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె పోస్టర్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘శుభం’ సినిమా ఫేమ్ గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన బ్రిగిడా సాగా హీరోయిన్గా నటిస్తోంది. వైఎన్ లోహిత్ దర్శకత్వంలో ‘విలేజ్ టాకీస్’ బ్యానర్పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి టాలీవుడ్ స్టార్స్ తరలివచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత క్లాప్ కొట్టగా, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, వశిష్ఠ వంటి ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.