ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్

  • హైకోర్టు విచారణకు హాజరుకాబోనని జడ్జికి లేఖ రాసిన కేజ్రీవాల్
  • న్యాయంపై నమ్మకం పోయిందని, సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడి
  • వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ విచారణకు రాబోనున్న ‘ఆప్’ చీఫ్
  •  జడ్జిని మార్చాలన్న తన అభ్యర్థనను గతంలో కోర్టు తోసిపుచ్చిందని వెల్లడి
  • జస్టిస్ స్వర్ణకాంత నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని ప్రకటన
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ, తన లాయర్ ద్వారా గానీ హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరుపుతున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన నేరుగా లేఖ రాశారు.

"జస్టిస్ స్వర్ణకాంత గారి నుంచి నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. అందుకే నేను మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. తన అంతరాత్మను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నానని, జస్టిస్ స్వర్ణకాంత నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే హక్కును వినియోగించుకుంటానని ఆయన తెలిపారు.

గతంలో ఇదే కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలని (Recusal) కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించరనే అనుమానం తనకు ఉందని ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ శర్మ కొట్టివేశారు. నిరాధారమైన ఆరోపణలు, ఊహాజనిత అనుమానాలతో జడ్జిని మార్చలేమని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యుల వృత్తిని ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తాజాగా విచారణకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Arvind Kejriwal
Delhi excise policy case
AAP
excise case investigation
Justice Swarna Kanta Sharma
Delhi High Court
Satyagraha
Supreme Court
liquor policy scam

More Telugu News