ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె అన్నీ లెక్కిస్తాం: జనగణన తెలంగాణ డైరెక్టర్

Director of Census Operations for Telangana on census
  • తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామన్న తెలంగాణ డైరెక్టర్
  • ఒక భవనంలో ఉండే ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి
  • 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన
జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హోళికెరె జనాభా లెక్కల సేకరణ వివరాలను శనివారం మీడియాకు వివరించారు. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామని ఆమె వెల్లడించారు. ప్రతి నిర్మాణాన్ని లెక్కలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె, అద్దె భవనం ఇలా అన్నింటి గణన జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఒక భవనం లేదా కాంప్లెక్స్‌లో ఉండే ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన మొదలయ్యేలోగా అన్నీ సిద్ధం చేస్తామని తెలిపారు. రెండో దశ జనగణనలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తామని అన్నారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తామని తెలిపారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కింగ్ చేస్తారని తెలిపారు.

ప్రతి ఇంటికి వెళ్లి జనగణనకు సంబంధించిన యాప్ ద్వారా 33 ప్రశ్నలను అడిగి వాటిని పూరిస్తారని చెప్పారు. జనగణనకు సంబంధించి ఒక ఇంటి నుంచి ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటామని చెప్పారు. భాషను, ఇంటి పెద్దల వివరాలు సరిగ్గా ఇవ్వాలని సూచించారు. మొబైల్ నెంబర్, భాష, ఇంటి పెద్ద పేర్లను ఒకసారి నమోదు చేస్తే, వాటిని మార్చడానికి వీలుండదని తెలిపారు.


Go Back to Shorts
Director of Census Operations for Telangana
Telangana

More Telugu News