కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదు.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

  • టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవిత
  • తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్దేవా
  • కేసీఆర్ ఒక మర మనిషి అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడి

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం క్రితం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జనసముద్రం సాక్షిగా ఆమె తన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరును ప్రకటించి, రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.


 ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ ను కవిత పూర్తిగా టార్గెట్ చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమ రథం దారితప్పిందని, సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని ఆమె ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.. "కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు.. ఆయనో మరమనిషి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన బయటకు రారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది" అని కవిత అన్నారు. ప్రజలకు ఏ చిన్ని కష్టం వచ్చినా ఆనాటి కేసీఆర్ బయటకు వచ్చేవారని... ఈనాటి కేసీఆర్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చేనేత కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో వారి కోసం కేసీఆర్ జోలె పట్టిన సందర్భాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కేసీఆర్ లో మార్పు వస్తుందేమోనని తాను చాలా కాలంగా ఎదురు చూశానని... ఆయనలో మార్పు రాకపోగా, తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మను కాపాడేందుకే తాను కొత్త పార్టీ పెట్టానని చెప్పారు.

Kavitha
Kalvakuntla Kavitha
TRS Telangana Rashtra Sena
KCR
BRS Party
Telangana Politics
Medchal
Telangana State
Political Party
Telangana News

More Telugu News