దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కావు: భానుప్రకాశ్ రెడ్డి
- హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు వేస్తామన్న భానుప్రకాశ్
- ప్రకాశ్ రాజ్ పై ఇప్పటికే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశామని వెల్లడి
- దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు హిందువులకే ఉండాలని డిమాండ్
సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లపై పెరుగుతున్న అవమానకర వ్యాఖ్యల పట్ల బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన్ని కించపరిచే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 298 ప్రకారం కేసులు వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కావని, అవి హిందూ ప్రార్థనా స్థలాలని భానుప్రకాశ్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కేవలం హిందువులకు మాత్రమే దక్కాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో అన్యమతస్తుల జనాభా పెరుగుతోందని, దీనిపై దేశవ్యాప్త చర్చ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై రిటైర్డ్ న్యాయమూర్తులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని దేవాలయాలపై దాడుల విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. హిందూ సంప్రదాయాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.