బెంగళూరు ఫ్యాక్టరీలో ఘోరం.. టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. వెంటనే గొంతు కోసి చంపేసిన యువతి!

  • బెంగళూరు ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో దారుణ ఘటన
  • టాయిలెట్‌లో ప్రసవించి, పసికందును హత్య చేసిన యువతి
  • అవివాహిత కావడంతో అవమాన భయంతోనే ఈ ఘాతుకం
  • 19 ఏళ్ల ఉద్యోగిని రేణుకగా గుర్తింపు.. కేసు నమోదు
  • నిందితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. యాపిల్ ఐఫోన్‌లను అసెంబుల్ చేసే ఫాక్స్‌కాన్ కంపెనీ ఫ్యాక్టరీలో ఓ యువతి తాను ప్రసవించిన పసికందును దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేవనహళ్లిలోని ఫ్యాక్టరీలో బుధవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే... ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 19 ఏళ్ల రేణుక అనే యువతి టాయిలెట్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే, బిడ్డ గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ఓ బ్యాగులో పడేసింది. ఈమె అవివాహిత కావడంతో సామాజిక అవమానానికి భయపడి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కొంతసేపటి తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన మరో ఉద్యోగిని, బ్యాగులో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి భయంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. శిశువు పుట్టిన తర్వాతే హత్యకు గురైనట్టు నిర్ధారించారు.

విచారణలో నిందితురాలిని రేణుకగా గుర్తించి, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. యువతి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో అనుకోకుండా ప్రసవం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Bengaluru
Teenager
Foxconn
Slits Baby's Throat

More Telugu News