సింగపూర్ లోని ప్రఖ్యాత టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రులు
- మూడో రోజుకు చేరుకున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన
- టువాస్ పోర్టులో అత్యాధునిక సాంకేతిక విధానాలను పరిశీలించిన మంత్రులు
- షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఏఐ సాంకేతికతను జోడించిన తీరును పరిశీలించిన మంత్రులు
ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. సింగపూర్ లోని ప్రఖ్యాత టువాస్ పోర్టును ఈరోజు మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పోర్టులోని అత్యాధునిక సాంకేతిక విధానాలను మంత్రులు పరిశీలించారు. కంటైనర్లను తరలించడానికి అక్కడ ఉపయోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలను చూసి మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
భారీ క్రేన్లను ఆపరేటర్లు నేరుగా క్రేన్ పైకి వెళ్లకుండానే, కింద కూర్చుని రిమోట్ ద్వారా నియంత్రించే విధానాన్ని ప్రత్యేకంగా గమనించారు. షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఏఐ సాంకేతికతను జోడించి కార్యకలాపాలను ఏ విధంగా వేగవంతం చేస్తున్నారో మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, బి.సి. జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొని, అక్కడ ఉన్న స్మార్ట్ వ్యవస్థలను అధ్యయనం చేశారు.