ఇటలీలో సాయం అందలేదన్న యువకుడు.. స్పందించిన భారత ఎంబసీ

  • ఇటలీలోని రాయబార కార్యాలయం తనను లోనికి అనుమతించలేదన్న యువకుడు
  • యువకుడి ఆరోపణల్లో వాస్తవం లేదన్న భారత ఎంబసీ
  • ఐడీ లేదా పాస్‌పోర్ట్ చూపించేందుకు నిరాకరించాడని వెల్లడి
తనకు భారత ఎంబసీ సాయం చేయలేదని ఒక పౌరుడు చేసిన ఆరోపణలను ఇటలీలోని భారత రాయబార కార్యాలయం ఖండించింది. సోషల్ మీడియా ఖాతా ప్రకారం, జతిన్ సరోహా అనే వ్యక్తి ఇటీవల రోమ్‌లోని భారత ఎంబసీని సంప్రదించాడు. పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా తాను మాల్టా నుంచి భారత్‌కు పాదయాత్రగా వెళుతున్నానని పేర్కొన్నాడు. తాను భారతీయుడినని, ఇప్పటికే 1500 కిలోమీటర్లు నడిచానని తెలిపాడు.

అయితే తాను ఇటలీలోని రాయబార కార్యాలయం అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ తనను లోనికి అనుమతించడం లేదని ఆరోపించాడు. ఈ మేరకు అతను ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు. ఆయన ఆరోపణలపై రోమ్ లోని భారత ఎంబసీ స్పందించింది.

అతడు భారత ఎంబసీకి వచ్చింది వాస్తవమేనని, కానీ ఐడీ లేదా పాస్‌పోర్టు చూపించేందుకు నిరాకరించాడని ఎంబసీ వెల్లడించింది. సందర్శకుల కోసం కొన్ని కనీస భద్రతా ప్రమాణాలు ఉన్నాయని తెలిపింది. ఎంబసీని సంప్రదించేవారు వాటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అతడి ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.

Indian Embassy in Italy
Youth Allegations

More Telugu News