మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత.. నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఇదే!

Nadendla Bhaskar Rao passes away
  • అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో నాదెండ్ల కన్నుమూత
  • హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూత
  • రేపు సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • 1984లో నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల
  • నాదెండ్ల వయసు 90 సంవత్సరాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల... కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. 

ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన... 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరారు. 1984లో చికిత్స కోసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో... కొంత మంది ఎమ్మెల్యేల మద్దతులో నాదెండ్ల సీఎం అయ్యారు. నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల... ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.
Go Back to Shorts
nadendla bhaskar rao

More Telugu News