గోర్కా సమస్యకు 6 నెలల్లో పరిష్కారం.. బీజేపీతోనే అది సాధ్యం: అమిత్ షా
- దశాబ్దాల నాటి గోర్కా సమస్యకు పరిష్కారం చూపుతామన్న అమిత్ షా
- గోర్కా ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్య
- ఆరు నెలల్లోనే గోర్కాల ముఖంలో ఆనందాన్ని చూస్తారన్న అమిషా
పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్లో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ... గోర్కా వర్గ ప్రజలకు భారీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దశాబ్దాల కాలం నాటి గోర్కా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన స్పష్టం చేశారు.
గోర్కా ప్రజల మనోభావాలను, వారి ఆందోళనలను అర్థం చేసుకోగల ఏకైక పార్టీ బీజేపీయేనని, మరే ఇతర పార్టీ కూడా ఈ సమస్యను పరిష్కరించలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే గోర్కాల ముఖంలో ఆనందాన్ని చూస్తారని... వారు శాంతియుతంగా జీవించేలా పరిష్కారాన్ని గుర్తిస్తామని హామీ ఇచ్చారు.
అయితే, తన ప్రసంగంలో అమిత్ షా ఎక్కడా నేరుగా 'గోర్కాల్యాండ్' లేదా 'ప్రత్యేక రాష్ట్రం' అనే పదాలను వాడకపోవడం గమనార్హం. కేవలం 'సమస్య పరిష్కారం' అనే అంశంపైనే ఆయన దృష్టి సారించారు.