కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు

  • చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శలు
  • బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని ఆరోపణ
  • తెలంగాణ సీఎం రేవంత్‌తో టీడీపీ ఎంపీలు ఎందుకు కలిశారన్న అప్పిరెడ్డి
  • టీడీపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వైఖరి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే, కాంగ్రెస్‌తో లోపాయికారీ బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీలు ఎందుకు సమావేశమయ్యారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఏం జరుగుతోందని నిలదీశారు. టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు? రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు? బీజేపీ ఎంపీ వర్మ, రేవంత్‌కు బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం, దానికి టీడీపీ నేతలు కూడా వెళ్లడం ఏంటి? అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు? అని అప్పిరెడ్డి ప్రశ్నించారు.
 
చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు ఏంటో ప్రజలకు వెల్లడించాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. 'మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు? యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు,' అంటూ ఆయన ధ్వజమెత్తారు.

పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, దీనికి బాధ్యులైన వారిని మహిళా లోకం క్షమించదని అప్పిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu
YS Jagan
YSRCP
TDP
Revanth Reddy
Andhra Pradesh Politics
AP Politics
Congress
BJP Alliance
Lella Appireddy

More Telugu News