ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

  • పలు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్ల నియామకం
  • ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా పలువురికి కొత్త బాధ్యతలు
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ
నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సూరపాటి ప్రశాంత్ కుమార్ (2021 బ్యాచ్)ను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు. ఆయనకు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగించారు. అక్కడ కొత్త ఆర్డీవోను నియమించే వరకు రంపచోడవరం సబ్-కలెక్టర్ బాధ్యతలను కూడా ఆయనే చూస్తారు.

ఇప్పటివరకు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వైఖోమ్ నిడియా దేవి (2021 బ్యాచ్)ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. రంపచోడవరం సబ్-కలెక్టర్‌గా ఉన్న శుభమ్ నోఖ్వాల్‌ (2023 బ్యాచ్)ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. అలాగే చింతూరు సబ్-కలెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్-కలెక్టర్ వైశాలి ఆర్‌ను (2023 బ్యాచ్) అదే ప్రాంత ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. కొత్త ఆర్డీవో నియామకం జరిగే వరకు ఆమె పార్వతీపురం సబ్-కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన బాచు స్మరణ్ రాజ్‌ (2022 బ్యాచ్)ను బదిలీ చేసి, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
 

IAS officers transfer
AP government
G Sai Prasad
Surapati Prashanth Kumar
Polavaram district
Vaikhom Nidia Devi
Shubham Nokwal
Vaishali R

More Telugu News