ఏపీలో నేటి నుంచి జనగణన

AP Census 2027 to Begin Today with Digital Method Says J Nivas
  • నేటి నుంచే ఏపీలో జనగణన-2027 తొలిదశ ప్రక్రియ
  • చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన
  • ప్రజల కోసం కొత్తగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయం
  • తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక
  • ఎన్యూమరేటర్లుగా 80 శాతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం
ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన భారత జనగణన-2027కు ఏపీలో రంగం సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మొదటి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణన (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) చేపడుతున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈసారి జనగణన ప్రక్రియలో ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు 'స్వీయ గణన' (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయాన్ని కల్పించినట్లు నివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించవచ్చని కోరారు. ప్రజలు ఇచ్చే సమాచారం అత్యంత భద్రంగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

జనగణన విధులకు ఆటంకం కలిగించినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేటర్లుగా 80 శాతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనే నియమించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 20 శాతం ఇతర శాఖల ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటారని వివరించారు.


Go Back to Shorts
AP Census 2027
Andhra Pradesh Census
Digital Census India
Self Enumeration
House Listing
Housing Census
Village Secretariat Employees

More Telugu News