ఏపీ సీఎంపై పోస్టుల కేసు.. మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్

  • సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుల కేసులో పూడి శ్రీహరి అరెస్ట్
  • జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరి
  • ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
  • చిత్తూరులో నమోదైన కేసు ఆధారంగా పోలీసుల చర్యలు
వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి సీపీఆర్ఓగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో యానిమేషన్ పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై చిత్తూరు జిల్లాలో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా యానిమేషన్ చేసి పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Pudi Srihari
YS Jagan
Chandrababu Naidu
YCP
Social Media Posts
Chittoor
AP Politics
Arrest

More Telugu News