ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన తనయుడు

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి అని కూడా చూడకుండా ఓ కుమారుడు ఆమెను సజీవదహనం చేశాడు. గదిలో బంధించి, ఇంటికి నిప్పుపెట్టడంతో ఆ వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ పాశవిక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒంగోలులోని గద్దలగుంట ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా తల్లితో గొడవ పడుతున్న కుమారుడు, ఈ రోజు మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనయ్యాడు. తల్లిని ఒక గదిలో పెట్టి బయట నుంచి తాళం వేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే లోపల ఉన్న వృద్ధురాలు పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Ongole Murder
Prakasam District Crime
Mother Murder
Son Arrested
Parricide India
Old Woman Killed
Property Dispute
Crime News Andhra Pradesh
Andhra Pradesh News
Arson

More Telugu News