అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. దిగ్గజ గాయని, స్వర సామ్రాజ్ఞి ఆశా భోంస్లే (92) పంచభూతాల్లో లీనమయ్యారు. ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సూర్యాస్తమయ వేళ, అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు.

కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణలతో తుది సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ బ్యాండ్ సభ్యులు ‘లాస్ట్ పోస్ట్’ వాయిస్తూ ఆమెకు సైనిక లాంఛనాలతో నివాళి అర్పించారు. అంతకుముందు ఆమె నివాసం నుంచి శివాజీ పార్క్ వరకు భారీ ఊరేగింపుతో అంతిమయాత్ర సాగింది. 

ఆశా భోంస్లే ఏప్రిల్ 12న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్లు తొలుత వార్తలు వచ్చినా, ఛాతీ ఇన్ఫెక్షన్, తీవ్రమైన అలసట కారణంగా ఆమె మరణించినట్లు మనవరాలు జానై భోంస్లే వెల్లడించారు.

పదేళ్ల వయసులోనే మరాఠీ చిత్రంతో గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన ఆశా భోంస్లే, ఎనిమిది దశాబ్దాలకు పైగా తన గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. 'ఉమ్రావ్ జాన్', 'తీస్రీ మంజిల్', 'రంగీలా' వంటి చిత్రాల్లో ఆమె పాడిన ఎన్నో గీతాలు అజరామరంగా నిలిచిపోయాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'తౌబా తౌబా' పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆమె మరణంతో భారతీయ సంగీతంలో ఓ సువర్ణాధ్యాయం ముగిసినట్లయింది.



Asha Bhosle
Asha Bhosle death
Asha Bhosle funeral
Indian singer
Bollywood singer
Lata Mangeshkar
Mumbai
Shivaji Park
Pass away
Marathi cinema

More Telugu News