నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. చర్చలు కీలక దశలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేసిన ఒక ఫోన్ కాల్ వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా 21 గంటలకు పైగా సాగిన ఈ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.

ఈ పరిణామంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్పందించారు. "చర్చల మధ్యలో వాన్స్‌కు నెతన్యాహు ఫోన్ చేయడం వల్ల అమెరికా-ఇరాన్ చర్చల నుంచి దృష్టి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లింది. యుద్ధంతో సాధించలేనిదాన్ని అమెరికా చర్చల ద్వారా పొందాలని చూసింది" అని ఆయన విమర్శించారు. తాము చిత్తశుద్ధితో చర్చలకు హాజరయ్యామని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, నెతన్యాహు ఫోన్ కాల్ ఆరోపణలపై వాషింగ్టన్ ఇప్పటివరకు స్పందించలేదు.

చర్చల్లో అమెరికా ఆమోదయోగ్యం కాని డిమాండ్లను తమ ముందుంచిందని టెహ్రాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్ జలసంధిలో తమ నౌకలకు పూర్తి స్వేచ్ఛ కల్పించడంతో పాటు, ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలను తమకు అప్పగించాలని అమెరికా షరతులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది.

చర్చల వైఫల్యంతో రెండు వారాల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరో 9 రోజుల్లో ఈ ఒప్పందం గడువు ముగియనుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో ముడిచమురు ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల నుంచి తిరిగి 119 డాలర్ల స్థాయిని దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో అమెరికాకు మిత్రదేశాలైన స్పెయిన్, ఇటలీ వంటి దేశాల నుంచి కూడా మద్దతు కరవైంది.  

Benjamin Netanyahu
Iran US talks
Netanyahu phone call
Iran nuclear deal
US Iran tensions
Hormuz Strait
JCPOA
Oil prices
Israel
JD Vance

More Telugu News