రేపు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోంస్లే అంత్యక్రియలు

ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఆశా భోస్లే (92) కన్నుమూయడంతో భారతీయ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. రేపు (ఏప్రిల్ 13) ఆమె అంత్యక్రియలను ముంబైలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర మంత్రి అశీష్ షెలార్ ప్రకటించారు. ఆశా భోస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని ఆయన అన్నారు.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పారెల్‌లోని ఆమె నివాసంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని షెలార్ తెలిపారు.

తీవ్రమైన ఆయాసం, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించారు. బహుళ అవయవాలు విఫలం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) కావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 1933లో జన్మించిన ఆశా భోస్లే, కొన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైన గానంతో భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలారు. వేల సంఖ్యలో పాటలు పాడి, శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు అన్ని ప్రక్రియల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా సంగీత, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Asha Bhosle
Asha Bhosle death
Asha Bhosle funeral
Maharashtra government
Bollywood singer
Indian playback singer
Breach Candy Hospital
Mumbai
Ashish Shelar
Shivaji Park

More Telugu News